చైతన్యాన్ని శిలువు వేసి
మేధను అనాథను చేసి
అమావాస్యను ఆభరణంగా చేసి,
దేహపు ఆకటికి చీకటి ముసుగేసి,
హృదయం లేని మొండేలను
ముఖపుస్తకపు దండేలపై
విచ్చలవిడిగా ఆరవేసి
ఉన్మాదానికి ఉన్నతమైన
"పసితనం" అనే పేరు పెట్టేసి
ఇతరులను నమ్మించేసి
ఎవరికి వారు అర్దం లేని స్పర్దల్లో
నచ్చిన వారిపై
ప్రేమాస్త్రాలను సందించేసి
మరులుగొన్న మనోదాహం తో,
విలువైన కాలాన్ని తాగేసి
స్వీయానుభవాల ఊయలలూగుతూ,
ఖర్మ సిద్ధాంతాల ఉమ్మనీరు తాగి.
తప్పంతా ఇతరులపై రుద్దేసి ,
ఆపేక్షా,ఉపేక్షల ఉరితీతలలో,
ఏది వసంతమో, ఏది శిశిరమో
తెలీక, యదార్దాలను రాల్చేసి
సంకుచిత తత్వాల నెగడులో
నిప్పుల స్నానం చేస్తున్న కాలంతో
రుగెత్తలేక నుసిలా రాలుతున్న మనం
ఇకనైనా....... ,
కొన్ని నిజాల ఇజాలను భుజాలకెత్తుకుందాం