మాయావి
అందరూ అంటారు మనసు మల్లెలు పూయిస్తుందనీ, మనోహరంగా ఉంటుందనీ..
కానీ మనసు ఇలా కూడా ఉంటుంది తెలుసా..
సజావుగా సాగుతున్న జీవితానికి లేని పోనీ సొగసులద్ది ,
సతమతం చేసి సంజాయిషీ అడుగుతుంది.
వెన్నెలలా, పట్టుదారంలా మెరుస్తూ, మురిపిస్తూ,
చిక్కు వెంట్రుకలా చికాకు పెడుతుంది.
మ్రోగుతున్న హృదయాన్ని మూగదాన్ని చేసి,
దిక్కుతోచక దిగంబరమై రోదిస్తుంది.
తనువు తగలబడి పోతున్నా తాను మాత్రం ,
రక్తం మరిగిన వ్యాఘ్రం లా వేటాడుతుంది.
ముఖం మీది చిరవ్వులతో నటిస్తూఉంటామా ,
చర్నాకోలుతో కొట్టి చెవులుమూస్తుంది.
నిద్రను చెడగొట్టి కళ్ళకు చీకటి గంతలుకట్టి,
కలతలను కానుకగా ఇస్తుంది.
మరగున పడిన తలపులను తలనుండి తోడి,
తనువును తడిపేస్తుంది.
చిక్కిశల్యమైన శరీరానికి శుష్కించిన చిరునవ్వునద్ది,
చిత్రంగా తిలకిస్తుంది.
గొంతునుండి గుబులు బైటకి రానీక ,
మాటలకు మమకారపు రంగు వేస్తుంది.
ఎదురుపడి వేదనను వెళ్లగక్కే సమయానికి,
అభిమానపు ఆభరణం అరువుగా ఇస్తుంది.
బంధనాలు తెంచుకొనే తెగింపు వచ్చినప్పుడు,
బేలగా మారి గోలచేస్తుంది.
విచ్చుకొనే వేకువకూ . .అంతమయ్యే సంద్యకూ,
సంకెళ్ళు వేసి మరణశాసనం రాస్తుంది.
గుండెను మెలిపెట్టి, నరాలను నుజ్జుచేసి, ఆశ్రువులను ఆరనివ్వక,
అయినవారికి దూరమైనప్పుడు ముక్కలవుతుందీ మహమ్మారి మనస్సు.
చింతతో చితగ్గొట్టి, వేదనతోవిరగొట్టి, బాధతో బంధించి,
మాయలతో మాలిమి చేస్తుందీ మాయావి మనస్సు.